Tuesday, November 21, 2023

Reading Shakespeare in Modern Era

"క్లాసిక్స్ గురించి అందరూ అత్యుత్సాహంగా మాట్లాడతారు గానీ నిజానికి ఎవరూ చదవరని" తనదైన శైలిలో చమత్కరిస్తారు ఆస్కార్ వైల్డ్. పుట్టినప్పటినుండీ ఆనోటా,ఈనోటా వినీ వినీ నోట్లో నానిపోయి, విలువ కోల్పోయి వీగిపోయిన అనేక సార్వత్రిక పదాల్లో క్లాసిక్స్ కూడా ఒక భాగం. రచయితల్లో 'షేక్స్పియర్' పేరు కూడా ఒకవిధంగా అటువంటిదే.

Image Courtesy Google

పాఠ్యపుస్తకాల్లో భాగంగా ఆయన్ను ఎంతో కొంత అందరం చదివే ఉంటాం. ఆయన కథలు అక్కడక్కడా వినే ఉంటాం. ఆయన తెలీనివారు ఎవరూ ఉండరు. కానీ ఆయనేం రాశారో, షేక్స్పియర్ ఎందుకంత గొప్పో తెలిసినవారు మాత్రం ఈరోజుల్లో అరుదుగా కనిపిస్తారు. 'బుక్ నెర్డ్', 'బుక్ వార్మ్' లాంటి టైటిల్స్ సంపాదించుకున్న చదువరులు సైతం నిజానికి షేక్స్పియర్ క్షుణ్ణంగా చదివి ఉండరు. 'షేక్స్పియర్' అంటే ఒక బ్రహ్మ పదార్థం, సామాన్య పాఠకుడికి అందని ద్రాక్ష, అకాడెమియాకి మాత్రమే సంబంధించిన రాతలు రాసే రచయిత, అబ్బే గ్రాంథికం, టీచర్లు, లెక్చరర్లు మాత్రమే చదువుతారు ఆయన్ని,మనకెందుకు ! 'ప్లెషర్ ఆఫ్ రీడింగ్' కంటెంట్ కాదేమో కదా !' ఇలా అనేక సాకులతో ఆయన్ని ప్రక్కకి నెట్టేసి నా మటుకు నేను పుస్తకాలు  చదువుకుంటుంటే, నా అభిమాన రచయితల్లో ఒకరైన రష్యన్ రచయిత సిగిజ్మన్డ్ క్రిఝిఝానోవ్స్కీ వ్యాసాలు కొన్ని చదువుతున్నప్పుడు ఆయన బెర్నార్డ్ షాకీ, షేక్స్పియరుకీ వీరాభిమాని అని తెలిసింది. ఇది నాలో సహజంగానే కుతూహలం రేకెత్తించింది. ఫెంటాస్టిక్ ఫిక్షన్ రాయడంలో అంతటి నైపుణ్యం గల వ్యక్తిని ప్రభావితం చేసిన రచయిత అంటే షేక్స్పియర్ సాహిత్యంలో కేవలం పదాడంబరాలు మాత్రమే ఉండవేమో ! అంతకుమించిందేదో ఖచ్చితంగా ఉండుండాలి అనిపించింది.

అకడెమిక్స్ లో భాగంగా కొంత చదవడం వల్ల ఆయన కథలు పరిచయమే. అయినప్పటికీ ఆయన లిరికల్ ప్రోజ్ తో పరిచయం లేదు. చాలా వరకూ ఆయన నాటకాలన్నీ కథలుగానే చదువుకున్నాను. మళ్ళీ చాలా కాలానికి నేను చదివిన రచన 'A Midsummer Night's Dream'. మనసులో ఈ ఆలోచన వచ్చిందే తడవు ఎడాపెడా రోజుకో పుస్తకం నమిలి పారెయ్యడానికి షేక్స్పియరియన్ ఇంగ్లీషు అంత సులభమేమీ కాదు. అందువల్ల ఆయన్ని ఎలా చదవాలి అన్న విషయమై కొంత గూగుల్ రీసెర్చ్ చెయ్యాల్సొచ్చింది. షేక్స్పియరును చదవడం ఆంగ్లం మాతృభాషగా ఉన్నవాళ్ళకు సైతం చాలా కష్టమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిప్రాయాలు చూసినప్పుడు అర్థమైంది. నిజానికి షేక్స్పియర్ రాసినవన్నీ నాటకాలు. ప్రచురణకు తగిన ఉపకరాలు అందుబాటులో లేని కాలంలో సాహిత్యం లిఖితరూపంలో కాకుండా శబ్దరూపంలోనూ, దృశ్యరూపంలోనూ లేదా నాటకప్రదర్శనల ద్వారానూ వ్యాప్తిచెందే కాలానికి చెందినవి ఈ కథలు. అందువల్ల ఈ కథలన్నీ శబ్ద ప్రధానమైనవి. 'కోరా' వెబ్సైటులో "షేక్స్పియర్ ను ఎలా చదవాలి ?" అనే ప్రశ్నకు ఒక స్త్రీ భలే సమాధానం ఇచ్చారు. షేక్స్పియర్ రాసినవన్నీ నాటకాలు కాబట్టి, పుస్తకరూపంలో ఆ 'స్క్రిప్టు' చదవడం గేమ్ ఆడకుండా ప్రోగ్రామర్ రాసిన 'కోడింగ్' చదవడంతో సమానమన్నారు. ఇది చదివి భలే నవ్వొచ్చింది. 

ఏది చదివినా పైపైన చదివి వదిలెయ్యకుండా క్షుణ్ణంగా చదవడం అలవాటు కాబట్టి, షేక్స్పియరును ఒక పద్ధతిలో చదువుదామని నిర్ణయించుకున్నాను. సముద్రంలో మునగాలని నిర్ణయించుకున్నప్పుడు తగిన ఏర్పాట్లు, కొంచెం ప్లానింగ్ అవసరం కదా ! నేను "మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ " క్లుప్తంగా ఇలా మూడు దశల్లో చదివాను/ చూసాను.

* మొదటి దశలో చార్లెస్ లాంబ్, మేరీ లాంబ్ రాసిన షేక్స్పియర్ కథల్లో చదవాలనుకున్న నాటకాన్ని ఆధునికాంగ్లంలో కథలా చదివాను.

* రెండో దశలో మూలాన్ని లిరికల్ ఫామ్ లో పైకి చదువుకుంటూ క్రింద ఇచ్చిన ఫుట్ నోట్స్ లో అర్థాలు అన్వయించుకుంటూ చదివాను.

* మూడో దశలో Kenneth Branagh దర్శకత్వం వహించిన పలు షేక్స్పియర్ నాటకాలు ఆన్లైన్ లో లభ్యమైనవి డౌన్లోడ్ చేసి చూశాను. ఇంతా చేస్తే గానీ "షేక్స్పియర్ ఎస్సెన్స్" పూర్తిగా వంటబట్టదనిపించింది.

Thursday, November 2, 2023

బహుముఖ ప్రతిభాశాలి సుబ్బరామయ్య గారు

సుబ్బరామయ్య గారికున్న పలుకుబడి అంతా ఇంతా కాదు. రైతుకుటుంబంలో పుట్టినప్పటికీ బాగా చదువుకుని, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి, స్వల్పకాలంలోనే పరిశ్రమలు కూడా స్థాపించి తానే మరి కొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకొని మారుతున్న కాలంతో బాటుగా ఆధునికతను అందిపుచ్చుకుని సమాజంలో అనతికాలంలోనే ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నారు.

Image courtesy Google 

కానీ ఎంత కీర్తి ప్రతిష్ఠలార్జించినా, తరతరాలూ కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిని సంపాదించినా సుబ్బరామయ్య గారిని లోలోపల ఏదో తెలీని వెలితితో కూడిన అసంతృప్తి తినేస్తూ ఉండేది. తన రంగంలో ఇక సాధించడానికేమీ మిగలకపోవడంతో కొందరి మిత్రుల సలహా మేరకు ఆధ్యాత్మికత బాట పట్టారు. "ఉన్నదొకటే జిందగీ" అని నమ్మే సుబ్బరామయ్యకూ, దేవుడికీ మొదట్నుంచీ పెద్దగా పొసగకపోయినా కాలక్షేపంకోసమో, కుతూహలం కొద్దీనో సాధుసంతుల సాంగత్యంలో గడుపుతూ ఆ నోటా ఈ నోటా విన్న ఆధ్యాత్మిక విషయాలను అందిపుచ్చుకున్నారు. మన సుబ్బరామయ్య గారికున్న వాక్చాతుర్యం ఎంతటిదంటే ఆయన పులిని చూపించి పిల్లి అని నమ్మబలికినా జనం ఇట్టే నమ్మేసేవారు. ఆయన సభల్లో ఆధ్యాత్మిక అంశాలపట్ల ఎంత సాధికారికంగా మాట్లాడేవారంటే విన్నవాళ్ళెవరైనా ముక్కున వేలేసుకుని "ఈయన సమస్త వేదాలూ ఔపాసన పట్టేశాడ్రోయ్" అనుకునేవారు. సుబ్బరామయ్యగారు ఆ ముఖస్తుతులనూ, కరతాళ ధ్వనులనూ కాదనకుండా ముసిముసి నవ్వులతో సవినయంగా స్వీకరించేవారు. కొంతకాలానికి ఎక్కడ ఏ ఆధ్యాత్మిక సభ జరిగినా "ఆధ్యాత్మిక జీవి" సుబ్బరామయ్య గారే ముఖ్య అతిథి.

ఇలా కొంత కాలం గడిచింది. సుబ్బరామయ్యగారిలో మళ్ళీ అసంతృప్తి మొదలైంది. ఆధ్యాత్మిక రంగంలో తనను యెరుగనివారు లేరు. ఆయనకు సహజంగానే ఆ వాతావరణం బోర్ కొట్టసాగింది. ఈలోగా పక్కూరిలో ఏదో సాహితీ సభ జరుగుతోందని విని కండువా మీదేసుకుని ఆ సభకు బయలుదేరారు ఖాళీగా ఉన్న సుబ్బరామయ్యగారు. ఆ కొత్త వాతావరణంతో బాటు సాహితీ సమూహాల్లోని విప్లవాత్మక ధోరణులు, వింత పోకడలూ సుబ్బరామయ్యగారిని అమితంగా ఆకర్షించాయి. ముందుగా ఒకరిద్దరు ప్రముఖులతో మొదలైన పరిచయాలు క్రమేపీ ఆయన ఇంట్లో జరిగే సాహితీ సమావేశాలూ, ఆతిథ్యాలతో విస్తృత రూపం దాల్చాయి. త్వరలోనే ఆయన  పేరు సాహితీ సమూహాల్లో మారుమ్రోగసాగింది. సుబ్బరామయ్య గారింట్లో కుక్కు తయారుచేసే మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలు, చట్నీలూ, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే మినప గారెల గురించి సాహితీ సంఘాల్లో పుంఖానుపుంఖాలుగా చర్చించుకునేవారు. సాహిత్యంతో పెద్దగా పరిచయం లేని సుబ్బరామయ్యగారు మాత్రం రచయితలు, కవులతో కూర్చుని వారు చెప్పే కబుర్లు పొల్లుపోకుండా వినేవారు. అలా సాహిత్యం గురించి, గొప్ప గొప్ప పుస్తకాల గురించీ ఆ నోటా ఈ నోటా సమాచారం తెలుసుకునేవారు. పుస్తకాల్లో నుండి వాళ్ళూ వీళ్ళూ కోట్ చేసే వాక్యాల్ని అందిపుచ్చుకుని మరొకరితో మరో సందర్భంలో వాడి ఆయనకు సహజంగానే ఉన్న వాక్చాతుర్యంతో సాహిత్యం గురించి తనకు సర్వమూ తెలుసని నమ్మబలికేవారు. రైట్ వింగు, లెఫ్ట్ వింగుల్లో ఇందులో చేరాలా అని లాభనష్టాలు బేరీజు వేసుకోగా, సాహితీవర్గాల్లో బాగా పాపులర్ అయిన లెఫ్ట్ వింగులో చేరడం లాభదాయకమని భావించి "లెఫ్టిస్టు" టాగ్ తగిలించుకుని తిరగసాగారు. సభల్లో మైకు దొరికినప్పుడల్లా "దేవుడు, దెయ్యం ట్రాష్" అంటూ ఆధ్యాత్మికత మీద విరుచుకుపడి సాహితీ సమూహాల జయజయధ్వానాలు అందుకునేవారు.

ఇలా కొంతకాలం గడిచింది. కాలంతో బాటు ఈ రైటు, లెఫ్టు తూకాలు మారసాగాయి. మళ్ళీ వెంటనే రైటు వైపు మొగ్గలేరు కాబట్టి సాహితీ సమూహాల నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్న సుబ్బరామయ్య గారు ఖాళీగా ఇంట్లో ఉండడం ఇష్టంలేక దేశాటనకు బయలుదేరారు. తిరిగొచ్చిన వెంటనే సాహితీ సమూహాల్లో తన ప్రాభవం తగ్గుతోందని గ్రహించారు. మిత్రులకు తన ఇంట్లో తిన్న ఇడ్లీ, దోశలనూ, వాటిల్లో తాను మరచిపోకుండా వేసిన ఉప్పునూ గుర్తుచేశారు. కృతజ్ఞతాభారంతో కృంగిపోయి "మీరు గొప్ప సాహితీవేత్త" అన్నారొకరు. మీలాంటి "సహృదయులైన విమర్శకులు అరుదు" అన్నారు మరొకరు. "మీరు చేసిన సాహితీ కృషి అజరామరం" వంతపాడారు వేరొకరు. ఆ విధంగా సుబ్బరామయ్య గారు "సాహిత్య జీవి"గా మిగిలిపోయారు. ఎటొచ్చీ ఆయన చేసిన "సాహితీ కృషి"కి ఇడ్లీలూ, దోశలూ తప్ప ఎటువంటి ఆధారాలూ లేవు.

కొంతకాలం తరువాత సహజంగానే పాతనీటిని తోసేస్తూ కొత్తనీటి ప్రవాహం వెల్లువెత్తింది. తన వాక్పటిమ  వారిముందు పనిచేయకపోవడంతో సుబ్బరామయ్యగారిలో అసహనం పెల్లుబికింది. దాంతో "సాహిత్యం ఉత్తి డొల్ల", "ఈ రచయితలు తామేదో సర్వాంతర్యాములు అనుకుంటారు", "పుస్తకాల్లో ఏముందండీ, ఒట్టి బూడిద" అంటూ మేకపోతు గాంభీర్యంతో ప్లేటు ఫిరాయించారు సుబ్బరామయ్య గారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. "సాహిత్యం వాళ్ళూ , ఆధ్యాత్మికం వాళ్ళూ ఎవరైనా ఇంటికి వస్తే అయ్యగారు ఇంట్లో లేరని చెప్పు" అని తన పనివాడికి పురమాయించి, ఈసారి తన ప్రతిభను నిరూపించుకోడానికి ఏ రంగం మీద దృష్టిపెడితే బావుంటుందా అని ఆలోచిస్తూ తలపంకించారు సుబ్బరామయ్యగారు. 

ఇందులో పాత్రలూ, సన్నివేశాలూ కేవలం కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కాదు.